వర్గీకరణ సమస్య – ఓ పరిశీలన

Classification Problem - An observationసుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ సమస్యపై మరోసారి వాదోపవాదాలకు తెరతీసింది. వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనని, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం అడ్డుకాదని కోర్టు మెజారిటీ తీర్పునిచ్చింది. ఏడుగురి ధర్మాసనంలో ఒక్కరు మాత్రమే ఈ అభిప్రాయంతో విబేధించారు. ఈ సందర్భంలోనే ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీలేయర్‌’ను కూడా ప్రవేశ పెట్టడం మంచిదని విడివిడి తీర్పుల్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయ మూర్తి, మరొకరు మాత్రం ఈ విషయంపై మౌనం వహించారు. మొత్తమ్మీద సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా లేవనెత్తబడిన రాజ్యాంగపరమైన అభ్యంతరాలపై స్పష్టమైన తీర్పునిచ్చింది. వర్గీకరణ చెయ్యాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలివేసింది. కోర్టుకు వచ్చిన వ్యాజ్యం రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ తీర్పు కేంద్రానికి కూడా వర్తిస్తుంది. గతంలో కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ సమస్య ముందుకొచ్చినప్పుడు సీపీఐ(ఎం) వర్గీకరణను సమర్థించింది. ఎస్సీల్లోనే వివిధ ఉపకులాల మధ్య విద్యా, ఉద్యోగాలలో కొట్టొచ్చి నట్లు వ్యత్యాసాలు వున్నాయని అధ్యయన కమిటీలు స్పష్టమైన వివరాలు/ డేటాపై ఆధారపడి సమర్పించిన నివేదికల ఆధారంగా నిర్ధారించినప్పుడు సీపీఐ(ఎం) వర్గీకరణకు సానుకూలత ప్రకటించింది.
తీర్పు నేపథ్యం-కొన్ని అంశాలు
పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తమ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎస్సీ తరగతిలో వర్గీకరణ చెయ్యడానికి నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కోర్టు తీర్పుల మూలంగా ఈ నిర్ణయాలు అమలులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వచ్చిన వాజ్యంపై వర్గీకరణ రాజ్యాంగబద్దం కాదని సుప్రీంకోర్టు 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వచ్చిన అనేక పిటిషన్లన్నింటిని కలిపి విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం 2024 ఆగష్టు 1వ తేదీన తన తీర్పును వెలువరించింది. తీర్పులో వివాదాస్పదంగా మారిన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
రాజ్యాంగంలో 341 అధికరణం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడానికి అనుమతించదన్న వాదనను కోర్టు తిరస్కరించింది.ఎస్సీ, ఎస్టీ జాబితాలపై నిర్ణయించే హక్కు పార్లమెంటుదైనందున వర్గీకరణ అంశం కూడా పార్లమెంటు పరిధిలోనిదని, ఇందులో రాష్ట్రాల జోక్యానికి తావులేదన్న వాదనను తిరస్కరిస్తూ, తమ పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. వర్గీకరణ చేసేహక్కు పార్లమెంటుదా, రాష్ట్రాలదా అనే అంశంకన్నా, అసలు వర్గీకరణ చేయడం అవసరమా లేదా అన్నది ముఖ్యం. ఈ అంశంపై స్పష్టత వస్తే ఎక్కడి నుండి ప్రారంభించడం బాగుంటుందన్న అంశం కేవలం సాంకేతిక, ఆచరణాత్మక సమస్య అవుతుంది.
వర్గీకరణ చట్టబద్దమా కాదా అన్న అంశాన్నే కాకుండా సమానత్వం సాధించడం అన్న కోణంలో కూడా వర్గీకరణ సమంజసమేనని కోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ తరగతి అస్పృశ్యత ‘అంటరానితనం’ గురయ్యే కులాల బృందంగా ఏర్పడినందున అది ఒక ‘ఏకఖండ’ (హోమోజీనియస్‌) బృందం, అందువలన దాన్ని విడదీయడం సమం జసం కాదన్న వాదనను కోర్టు తిరస్కరించింది. అస్పృస్యతకు ఎస్సీ తరగతిలో ఉన్న ఉపకులాన్ని గురవుతున్నా వాటి మధ్య అన్ని విషయాలలో ఏకరూపత లేదు. సామాజిక, ఆర్థిక, విద్యా విషయాలలో వ్యత్యాసం వుందని, హెెటి రోజీనియస్‌ బృందమని కోర్టు భావించింది. ఈ వ్యత్యాసాలను అధిగమించడానికి వర్గీకరణ సమంజసమేనని కోర్టు చెప్పింది.
విమర్శలు-ఆక్షేపణలు
ఈ అంశంపై కోర్టు సరైన సమాచారం/ డేటా లేకుండానే నిర్ధారణ చేసిందని ఆక్షేపణలు వచ్చాయి. ఈ విమర్శలో పసలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నియమించిన అధ్యయన కమిషన్ల రిపోర్టులు అంతర్గతంగా ఎస్సీ ఉపకులాల మధ్య వున్న వ్యత్యాసాలను బహిర్గతం చేశాయి. 2011 జనరల్‌ సెన్సెస్‌లో ఎస్సీ ఉపకులాలపై ఉన్న సమా చారాన్ని పరిశీలించినా వ్యత్యాసాలపై నిర్ద్వంద్వమైన సమాచారం దొరుకుతుంది. కొంతమంది వ్యత్యాసాలున్నాయని అంగీకరిస్తూనే, ఎస్సీల్లో వెనకబడిన ఉపకులాలు, ముందంజలో ఉన్న కులాలతో పోటీపడగల స్థాయికి రావడానికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలను అదనంగా కేంద్రం, రాష్ట్రాలు కల్పిస్తే సరిపోతుందని వర్గీకరణ అవసరం లేదని అంటున్నారు. ఈ సూచనలో అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదు కానీ ఇది వర్గీకరణకు ప్రత్యామ్నాయం కాదు. దానికి జత చేయాల్సింది మాత్రమే. వర్గీకరణ అనేది రిజర్వేషన్‌ హక్కులో భాగంగా వుంటుంది. వర్గీకరణ వలన లాభం ఏ కొద్దిపాటిదైనా, తక్షణం అందుబాటులోకి వస్తుంది.సదుపాయాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటాయి.
‘వర్గీకరణ’ రిజర్వేషన్ల వ్యవస్థను ఉనికిలోకి తెచ్చిన మౌలిక భావనకు భంగం కలిగిస్తుందని గతం నుండి వస్తున్న విమర్శ. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా వస్తున్నది. అణచివేత, అస్పృశ్యత వంటి సామాజిక అంశాలు రిజర్వేషన్ల వ్యవస్థ ఉనికికి ప్రాతిపదిక అని ఇప్పుడు కోర్టు వెనకబాటుతనం, తగ్గిన ప్రాతినిథ్యం వంటి అంశాలను ప్రవేశపెట్టి రిజర్వేషన్‌కున్న ప్రాతిపదికను బలహీనం చేస్తున్నదని ఈ విమర్శ సారాంశం.
ఈ విమర్శకు తగిన ప్రాతిపదిక వుందని అనుకోలేం. ఎస్సీలలో అంతర్గత వ్యత్యాసాలను అధిగమించేందుకు ముందుకు వచ్చిన అంశాన్ని రిజర్వేషన్ల మౌలిక భావనకు వ్యతిరేకం అని భావించడానికి ఆస్కారం లేదు. మన దేశంలో రిజర్వేషన్ల చారిత్రక నేపథ్యం, అస్పృస్యత లేని తరగతులకు కూడా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిన తీరును పరిశీలిస్తే, రిజర్వేషన్లను, ప్రాతినిథ్యాలకు ఏదో ఒక్క అంశం ప్రాతిపదికగా వున్నది అనుకోవడం సాధ్యం కాదు. సామా జిక అణచివేత, అస్పృశ్యతలను నేరాలుగా రాజ్యాంగం ప్రకటించింది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చట్టాలు కూడా తెచ్చాయి. అవి అధ్వాన్నంగా అమలు చేయబడుతున్నాయనేది వేరే విషయం. అయితే సామాజిక బలహీనత అధిగమించడానికి చట్టాలే సరిపోవని, విద్య, ఆర్థిక, రాజకీయ సాధికారతలను కూడా ఇవ్వడం అవసరమని భావించే, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
జనరల్‌ కోటాకు మళ్లింపు-బ్యాక్‌లాగ్‌ విధానం
వర్గీకరణ మూలంగా నిండని ఖాళీల సంఖ్య పెరుగుతుందని, వాటిని జనరల్‌ కోటాలోకి మళ్లించడం ద్వారా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని కొందరు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిండని ఖాళీలను జనరల్‌ కోటాలోకి మార్చాలన్న ప్రయత్నం వర్గీకరణ అంశంతో ముడిపెట్టడం సరికాదు. జనరల్‌ కోటాలోకి మార్చాలనే ప్రయత్నాలు వర్గీకరణ అంశం చర్చకు రాకముందు నుండి జరుగు తున్నాయి. వీటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల మూలంగానే ‘బ్యాక్‌లాగ్‌’ అన్న పద్దతి ప్రవేశ పెట్టబడింది. అయినా ఇప్పటికీ ఇటువంటి ప్రయత్నాలు జరుగు తూనే వున్నాయి. ఈమధ్య యుజిసి రిజర్వుడ్‌ ఖాళీలను జనరల్‌ కోటాలోకి ఎటువంటి పరిస్థితుల్లో మార్చవచ్చో వివరిస్తూ మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హడావుడిగా ఉపసంహరించుకుంది. ఇటువంటి ప్రయత్నాలను అడ్డు కోవడం తప్ప ఈ అంశాన్ని వర్గీకరణతో ముడిపెట్టడం తప్పు. అలాగే వర్గీకరణ అనేది ఎస్సీ తరగతి అంతర్గత అంశం: ఉన్న కోటాలో ఉప విభజన. అందువలన ఒక బృందంగా చూసినప్పుడు ఎస్సీ తరగతిగా నష్టపోయేది వుండదు. ఒక ఉపతరగతిలో ఖాళీ మిగిలిపోతే ఇంకో తరగతిలో అర్హులైనవారితో నింపవచ్చు. అన్ని ఉపతరగతుల నుండి కూడా భర్తీ కాకపోతే బ్యాక్‌లాగ్‌లో పెట్టవచ్చు. ఈ పద్ధతి వలన కోటా ఎస్సీ తరగతి దాటి బయటకు పోవడం వుండదు. రాష్ట్రాలు గానీ కేంద్రంగానీ వర్గీకరణ తీసుకువస్తే ఎస్సీ కోటా బయటకు పోకుండా రాజ్యాంగ, చట్టబద్దమైన ఏర్పాటు చేసేట్లుగా చూడాలి.
అభివృద్ధిలో వ్యత్యాసాలు-పరిష్కార మార్గాలు
వర్గీకరణకు మరికొన్ని అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. వర్గీకరణ దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుం దని వీటిలో ఒకటి. వాస్తవం ఏమంటే ఎస్సీల్లోని వివిధ ఉపకులాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాలే వర్గీకరణ డిమాండ్‌కు దారితీశాయి. వ్యత్యాసాలను అధిగమించే చర్యలను సమర్థించడమే ఐక్యతకు మార్గం తప్ప, వాటిని వ్యతిరేకించడం కాదు. దీని ద్వారా వ్యత్యాసాల పేరుతో అనైక్యతను సృష్టించేవారి ఆటలు కట్టించడం సులభం. అలాగే బూర్జువా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు ఉపయోగించు కొంటున్నాయనేది మరో విమర్శ. ఓట్ల కోసం ఒక సామాజిక తరగతిని ఇంకొక సామాజిక తరగతికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టడం, సమీకరించడం బూర్జువా పార్టీలు ఒక శాస్త్రంగా మార్చివేశాయనేది నిజం. ఈ కుటిల ప్రక్రియ ప్రయో గంలో బీజేపీ అన్నిటికన్నా ముందున్నది. ఎస్సీల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాలను గుర్తించి, పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా మాత్రమే బూర్జువా పార్టీల అనైక్యత సృష్టించే ఎత్తుగడలను తిప్పికొట్టగలం.
వర్గీకరణ సర్వరోగ నివారిణి కాదు
సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక ఎస్సీల్లోని వెనకబడిన ఉపకులాల సమస్యలన్నిటికి పరిష్కారం దొరికిపోయిందని ఎవరైనా భావిస్తే వారికి నిరాశే ఎదురవుతుంది.అలా చూస్తే రిజర్వేషన్లే సామాజిక అణచివేతను, దళితుల వెనకబాటు పరిస్థితిని పరిష్కరించలేదు. సరళీకరణ విధానాలొచ్చిన తర్వాత (బూర్జువా పార్టీలన్నీ వీటిని అమలు చేస్తున్నాయి) రిజర్వేషన్లు ఇంకా నామమాత్రం అవుతున్నాయి. ఈ స్థితిలో వర్గీ కరణ పెద్ద మార్పు సాధిస్తుందని అనుకోరాదు. ఎస్సీలలోని కొన్ని తరగతులలో అసంతృప్తి కారణమవు తున్న ఒక అంశానికి తక్షణ పరిష్కారం చూపించడం ద్వారా ఐక్యతను పెంపొందించడం జరిగితే, అదే మనం ఆశించగల పెద్ద లాభం.
అసలైన పరిష్కారం వెనకబాటుకు కారణమైన మౌలిక అంశాలను పరిష్కరించడంలో ఉంది.ఇప్పటికీ దళితులను అట్టడుగు స్థాయికి కట్టిపడవేస్తున్న భూసంబంధాలను బద్దలుకొట్టాలి. భూపంపిణీ జరగాలి. నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగం, ఆహారం, ఆవాసం హక్కులుగా మారాలి. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు రావాలి. వీటిని సాధించుకుంటేనే దళితులకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పరిమితులను దాటి తమ వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు సత్తా వస్తుంది.
క్రీమీలేయర్‌ అవసరం లేదు
సుప్రీంకోర్టు తను పరిష్కరించాల్సిన ‘వర్గీకరణ’ వివాదంపై తీర్పు చెబుతూనే ‘క్రీమీలేయర్‌’పై కూడా వ్యాఖ్యలను చేసింది. నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను ఎస్సీ, ఎస్టీలకు కూడా అనువర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది అమలు చేయాల్సిన తీర్పులో భాగం కాకపోయినా, వివాదాస్పద అంశం. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వుండకూడదని సీపీఐ(ఎం) అభిప్రాయం. చారిత్రకంగా ఎటువంటి ఆస్తిపాస్తులు కలిగివుండడానికి నోచుకోని ఎస్సీలలో ఇప్పటికీ స్థిరమైన ఆస్తిపాస్తులు కలిగిన స్పష్టమైన ఒక తరగతి ఏర్పడలేదు. కొద్దిమంది రాజకీయ నాయకులను, ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను, కొద్దిమంది పరిశ్రమల యజమానుల పేర్లను చూపించి క్రీమీ లేయర్‌ను ప్రతిపాదించడం న్యాయం కాదు. ఈ కుటుంబాల చేతిలో తగినంత సంపద పోగుబడిందని, వారి సామాజికహోదా పెరిగిందని, అటువంటి కుటుం బాల సంఖ్య తగినంత మోతాదులో వుందని మాట వరసకు అంగీ కరించినా వాటి సంపద, సామాజిక హోదా తర్వాతి తరాలకు పాస్‌ఆన్‌ అవుతుందన్న పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఎస్సీ తరగతిలో క్రీమీలేయర్‌ గురించి ఇప్పుడు చర్చించడం అసందర్భం.
– బి.వి. రాఘవులు