అప్పుల ఊబిలో దేశం

A country in debt– పెరుగుతున్న ద్రవ్యోల్బణం
– కొండలా పెరుగుతున్న రుణాలు
– రాష్ట్రాలకు మాత్రం ఆంక్షలు విధిస్తున్న కేంద్రం
– తరుగుతున్న ఉపాధి కల్పన
– సంక్షోభంలో వ్యవసాయం
– సామాన్యులకు శాపంగా ప్రభుత్వ విధానాలు
భారత్‌పై రుణభారం కొండలా పెరిగిపోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గత డిసెంబరులో ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈ అప్పుల కుప్ప కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటూ ఐఎంఎఫ్‌ ప్రకటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాయి. 2022-23లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 86.5శాతం మేర ఉన్నాయని, ఇది సంక్షోభమేమీ కాదని చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి
వ్యవసాయోత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రభుత్వ రంగంలో మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడం, ప్రజల ఆదాయాన్ని పెంచడం, కార్పొరేట్‌ శక్తులపై అధిక పన్నులు వేయడం…. వంటి చర్యల ద్వారా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చే అవకాశం ఉంది. సంపన్నుల లాభాలను తగ్గించి, ఆ సొమ్మును సామాన్యుల సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు. అప్పుడే ప్రభుత్వం పైన, ప్రజల పైన రుణభారం తగ్గుతుంది.
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణాలు 2014-15లో జీడీపీలో 67శాతంగా ఉన్నాయి. అవి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుత స్థాయికి చేరాయి. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన 2020-21లో ఈ రుణాలు గరిష్ట స్థాయికి…అంటే జీడీపీలో 90%కి చేరుకున్నాయి. విడివిడిగా చూసినట్లయితే 2022-23లో జీడీపీలో కేంద్ర రుణాలు 61% ఉండగా, రాష్ట్రాల మొత్తం రుణాలు 29.5 శాతం మాత్రమే. ఈ గణాంకాలన్నీ ఆర్‌బీఐ అందించినవే. కేంద్ర రుణాలు కానీ, రాష్ట్రాల మొత్తం రుణాలు కానీ గత దశాబ్ద కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రుణాలు జీడీపీలో 100 శాతాన్ని చేరుకోలేదని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాదించే వారూ ఉన్నారు. అనేక సంపన్న ఆర్థిక వ్యవస్థల రుణభారం జీడీపీలో వంద శాతాన్ని దాటేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఆశాజనకంగా లేని ప్రైవేటు పెట్టుబడులు
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. దేశ ప్రజల ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య పెరగడం లేదు. మరోవైపు ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో రుణ స్థాయి అధికంగా ఉండడం కచ్చితంగా కలవరం కలిగించే విషయమే. మరో విషయమేమంటే మూలధనపు పెట్టుబడికి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఈ నిధిలో ఎక్కువ భాగం రహదారులు, బ్రిడ్జిలు వంటి మౌలిక సదుపాయాల కోసం ఖర్చవుతుంది. దీనివల్ల ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే అవి ఆశాజనకంగా లేవు.
రాష్ట్రాలపై పెరుగుతున్న ఆంక్షలు
ఇదిలావుండగా ఇటీవలి కాలంలో రాష్ట్రాల రుణ స్థాయిపై తాజాగా వివాదం చెలరేగింది. రాష్ట్రాలు మితిమీరి అప్పులు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రాలు తీసుకునే రుణాల పరిధిపై కేంద్ర చట్టాలు ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాయి. రాష్ట్రాల మొత్తం రుణాలు పెరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ రుణంలో అవి ఇప్పటికీ సగమే ఉన్నాయి. కానీ రాష్ట్రాల అప్పులు ఎందుకు పెరుగుతున్నాయన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. గత దశాబ్ద కాలంలో కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తున్న సందర్భాలు అనేకం. ఉదాహరణకు జీఎస్టీనే తీసుకుందాం. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం సంవత్సరాల తరబడి ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలలో తరచుగా జాప్యం జరుగుతోంది. జీఎస్టీకారణంగా పన్నులపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ హరించుకుపోయాయి. కేంద్రం విదిల్చే నిధుల పైనే అవి ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులను కూడా పూర్తిగా ఇవ్వడం లేదని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్పులు తీసుకోక తప్పడం లేదు. దీనంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వ ఏకీకృత, ఆంక్షలతో కూడిన వైఖరే. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్షణం.
వ్యవసాయ సంక్షోభంతో…
వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతులు, వ్యవసాయ కార్మికుల రుణభారం పెరుగుతోంది. పెట్టుబడి వ్యయం అధికంగా ఉండడం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించడం, ప్రభుత్వ సేకరణ తగ్గిపోవడం వంటి కారణాలతో రైతన్నలు మనుగడ కోసం మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. రైతుల్లో మూడింట రెండో వంతు ఉన్న చిన్న, మధ్యతరహా రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంటోంది.
వ్యక్తిగత రుణాలు కూడా…
ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడంతో కొనుగోలు శక్తి తగ్గుతోంది. ప్రజలు వినియోగ వస్తువుల కొనుగోలుపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం వ్యక్తిగత రుణాలపై ఆధారపడుతు న్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించడం, విద్యపై ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం వల్ల వ్యక్తిగత రుణాలు తీసుకో వడం అధికమైంది. 2014 మార్చిలో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు రూ.10.1 లక్షల కోట్లు ఉంటే 2023 మార్చి నాటికి అవి ఏకంగా రూ.41.8 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. వినియోగ వ్యయం కోసం, నాణ్యమైన వస్తువులు, ఆటోమొబైల్స్‌, ఇళ్లు, భూముల కొనుగోలు కోసం, విద్యా రుణాల కోసం అధిక వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు తీసు కుంటున్నారు.
సామాన్యుల నడ్డి విరుస్తూ…
ప్రభుత్వాలు తాము తీసుకునే రుణాలను వడ్డీతో సహా తీర్చేస్తాయి. వివిధ రూపాల్లో పన్నుల ద్వారా పోగు చేసిన సొమ్మును ఇందుకోసం వినియోగిస్తాయి. ఈ పన్నుల్లో ఎక్కువ భాగం భరించేది సామాన్య ప్రజలే. మోడీ ప్రభుత్వం సంపన్న కార్పొరేట్‌ రంగాలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు కల్పిస్తోంది. కార్పొరేట్‌ పన్నుల్లో నేరుగా కోత పెడుతోంది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కృత్రిమంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ రుణాలు తీర్చడానికి ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతోంది. దీంతో వ్యక్తిగత లేదా కుటుంబ అప్పులు పెరిగిపోతున్నాయి. ప్రజల రోజువారీ జీవితాలు గడవడమే దుర్భరంగా మారింది.
ఆర్థిక విధానాలే కారణం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా దేశ ప్రజలపై మోయలేని రుణభారం పడుతోంది. 2018వ సంవత్సరపు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపై సగటున రూ.60,000 రుణభారం పడుతోంది. అదే పట్టణ ప్రాంతంలో అయితే ఈ భారం రూ.1.2 లక్షలుగా ఉంది. అయితే ఇది సగటు భారం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పులతో అల్లాడుతున్న కుటుంబాలను మాత్రమే కాకుండా జనాభా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని అంచనా వేశారు. 2012లో ఈ రుణభారం గ్రామీణ కుటుంబంపై రూ.32,522గా, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబంపై రూ.84,625గా ఉంది. ఆదాయాలు తక్కువగా ఉండడం, సరైన ఉపాధి లభించకపోవడం, నిరుద్యోగం, భద్రత లేని ఉద్యోగాలు వంటి కారణాలతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.