శిధిలావస్థలో పాఠశాల భవనం

– మన ఊరు మన బడిలో లభించని మోక్షం
– పెచ్చులూడిపోతున్న పైకప్పు..
– వర్షం వస్తే జలమయమవుతున్న భవనం..
– ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం..
– ఇదీ మండలంలోని విట్టల్ వాడి ప్రాథమిక పాఠశాల దుస్థితి
– ఆందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు 
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెచ్చులూడిపోతున్న పైకప్పు.. వర్షం వస్తే కారిపోతున్న భవనం.. ఆరుబయట నిలిచిపోతున్న నీరు.. ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం.. ఇదీ మండలంలోని  విట్టల్ వడి ప్రాథమిక పాఠశాల దుస్థితి. మన ఊరు మన బడి పథకంలో విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా విట్టల్వడి పాఠశాలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో 30 నుండి 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు గదుల ఈ పాఠశాల భవనం శ్లాబ్‌ పెచ్చులూడి పడిపోతున్నాయి. పిల్లలు గాయాలపాలవుతారేమోనని తల్లిదండ్రులు భీతిల్లుతున్నారు. వర్షం వస్తే భవనం కారిపోతుంది. భవనం గోడలు నానిపోతున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో నీరంతా స్కూల్‌ ఆవరణలో నిలిచిపోతుంది. దీనికి తోడు సగానికి పైగా ప్రహరీ గోడ దెబ్బతినడంతో పశువులు, కుక్కలు, పందులు పాఠశాల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.