శనిగరం ప్రాజెక్ట్‌ సమీపంలో ఫిష్‌మార్కెట్‌ ఏర్పాటు చేస్తాం

A fish market will be set up near Shanigaram project–  ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ – కోహెడ
శనిగరం ప్రాజెక్ట్‌ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఫిష్‌ మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మండలంలోని శనిగరం గ్రామ రిజర్వాయర్‌లో ఉచిత చేపపిల్లలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు మరింత న్యాయం చేకూరుతుందన్నారు. అలాగే మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు చేపపిల్లల పంపిణీని గతానికి మించి చేస్తున్నామన్నారు. గతంలో పేమెంట్‌ కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోన్నారని వాటిని కూడ పూర్తిచేస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలన్నారు. మత్స్యశాఖకు సంబంధించి మొభైల్‌ మార్కెట్‌లు చేపలను అమ్ముకోవడానికి మౌళిక వసతులు తదితర వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫిష్‌మార్కెట్‌ ఏర్పాటు చెసేందుకు ఆర్డీవో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని సూచించారు. హైద్రాబాద్‌, తదితర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇక్కడే చేపలు కొనుగోలు చేసి పోయేలా అభివృద్ధి జరగాలన్నారు. అలాగే శనిగరం గెస్ట్‌హౌజ్‌ను, ఫిష్‌పాండ్‌ను పునరుద్ధరణ చేస్తామన్నారు. మత్స్య సంపద, పశుపోషణ, పాలు, కోళ్ళు పెంపకం వాటిపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్‌ ఫాం, డ్రాగన్‌ ఫ్రూట్‌, చేపల చెరువు, కోళ్ళు పెంపకం, ఆవులు, గేదెల పెంపకంపై రైతు వేదికల వద్ద అవగాహన కల్పిస్తూ బ్యాంకర్లతో మాట్లాడి లోన్‌లకు ఇబ్బంది కాకుండా చూస్తున్నామన్నారు. కాలువలతో ప్రతి గ్రామానికి నీళ్ళు అందిస్తామన్నారు. డబుల్‌రోడ్‌ పూర్తయిన చోట అవెన్యూ ప్లాంటేషన్‌తో రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటాలని అధికారులకు సూచించారు. త్వరలోనె టాంకాం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి, కాంగ్రెస్‌ జిల్లా ఇంఛార్జీ పూజల హరికృష్ణ, శంకర్‌ రాథోడ్‌, రాష్ట్ర మత్య్సశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌, ఫిషరీష్‌ అధికారులు, జిల్లా గ్రంథాల ఛైర్మన్‌ లింగమూర్తి, ఆర్డీవో, పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.