ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

A proud reunion of former students..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలిసి పదవ తరగతి చదువుకున్న 2002-03 సంవత్సరం పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక పద్మశాలి విజయ సంఘం ఫంక్షన్ హాల్ వేదికయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విద్యాబుద్దులు నేర్పిన గురువులను, తోటి మిత్రులను ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన  ఆనాటి గురువులు రుక్మయ్య, విశ్వనాథ్, రాజేశ్వర్, ప్రవీణ్ లను పూలమాలలతో,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులంతా ఒకచోట  కలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను తాము మర్చిపోయిన, తమను మాత్రం మర్చిపోకుండా ఆహ్వానాన్ని పలకడం తమకు ఎంతో గర్వమని ఉపాధ్యాయులు అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పార్శపు జైపాల్ రెడ్డి, యామ శ్రీనివాస్, వంగరి రవి, సత్య కిషోర్, గణేష్, సాగర్, నరేష్, గోపిడి మహేష్, తిరుపతి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.