– వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజకుమారి
– యుక్త వయస్సు నుంచే యోగా సాధన చేయాలి
– జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
శారీరక శ్రమ ప్రాధాన్యత తగ్గిన తరుణంలో ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్య వంతమైన సమాజం సాధ్యం అవుతుందని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్.ఎన్. రాజకుమారి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ పరిధి లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్యర్యంలో శుక్రవారం నల్గొండ వైద్య కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్.ఎన్. రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద, జిల్లా యువజన అధికారి ప్రవీణ్ సింగ్, వైద్య కళాశాల అధ్యాపక సిబ్బంది, యోగ గురువు శంకరయ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆరోగ్య సమాజం తోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. పని ఒత్తిడికి గురి అవుతున్న వైద్యులకు యోగాతో ఉపశమనం లభిస్తుంది అన్నారు. ఆహారం, పర్యావరణం కలుషితం అవుతున్న తరుణంలో యోగా సాధన చాలా ముఖ్యంగా మారింది అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద అన్నారు. యువజన అధికారి ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగా లాంటి అద్భుత వ్యాయామ విద్య ను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు శంకరయ్య విద్యార్థులతో యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన చేయించారు. విద్యార్థులకు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే అంశం పై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.