ప్రతి జర్నలిస్టుకూ ఇంటి స్థలం

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తను ఎమ్మెల్యేగా గెలిస్తే మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జర్నలిస్ట్‌కు ప్రభుత్వం నుండి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేయిస్తానని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్ట్‌ సమస్యలు తీరుతాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందని అన్నారు. ఎంతో మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌ గా ఉన్న తెలంగాణ నేడు అప్పుల తెలంగాణగా సీఎం కేసీఆర్‌ మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నారబోయిన రవి ముదిరాజ్‌, నాయకులు అనంత స్వామి గౌడ్‌, నియోజకవర్గ జర్నలిస్టులు ఉన్నారు.