పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం– రూ:8 కోట్ల మేర నష్టం
నవతెలంగాణ -మాగనూర్‌
షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి మిల్లు కాలిబూడిదైంది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో మిల్లులో ఉన్న పత్తి బండిల్స్‌, జిన్నింగ్‌ చేయడానికి తీసుకొచ్చిన విత్తనాలు అగ్నికి ఆహుత య్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్‌ గ్రామ సమీపంలో జరిగింది. మిల్లు యాజ మాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. రెండేండ్ల కిందట నిర్మించిన వడ్వాట్‌ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్‌ కాటన్‌లో శనివారం రాత్రి 11:40 నిమిషాలకు షార్ట్‌ సర్క్యూట్‌తో మిల్లులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన పక్కనున్న రైస్‌ మిల్లు కూలీలు.. మిల్లు యాజమాన్యానికి విషయం తెలిపారు. అలాగే, వారంతా మిల్లు దగ్గరికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న మిల్లు యజమాని వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నారాయణపేట, మక్తల్‌ నుంచి పెద్ద ఎత్తున ఫైర్‌ ఇంజన్లు, ఇతర వాటర్‌ ట్యాంకర్లను రప్పించి మంటలు ఇతర మిల్లులకు వ్యాపించకుండా అదుపు చేశారు. మిల్లుతో పాటు, జిన్నింగ్‌ కోసం తెచ్చిన విత్తనాలు, పత్తి పూర్తిగా కాలిపోయాయి. దాదాపుగా రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు మిల్లు యాజమాన్యం తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హుటాహుటిన ఘటనాస్ధలికి చేరుకొని పూర్తిగా కాలిపోయిన మిల్లును పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో అగ్నిప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో బాధితులకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానని ధైర్యం చెప్పారు.