– రూ.2వేల కోట్లతో ‘ఇవానా’ సముదాయం
– రెండు దశల్లో 1850 యూనిట్ల నిర్మాణం
– సిఎండి అచ్యుతరావు బొప్పన వెల్లడి
హైదరాబాద్ : రియల్టీ రంగంలోని అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును నిర్మిస్తోన్నట్లు ప్రకటించింది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లను అభివృద్థి చేయనున్నట్లు పేర్కొంది. మొదటి దశలో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని 2024 డిసెంబర్లోగా కొనుగోలుదార్లకు అప్పగిస్తారు. ఇక రెండవ దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 2027లో 1,400 ఫ్లాట్లను అందజేస్తామని అన్విత గ్రూప్ సిఎండి అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద చదరపు అడుగు రూ.6,500లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. నిర్మాణ వ్యయం తొలి దశ ప్రాజెక్టుకు రూ.380 కోట్లు, రెండవ దశకు రూ.1,600 కోట్లకుపైగా అవుతుందని అంచనా వేశారు. ఇవానా మొదటి దశలో 8 లక్షలు, రెండవ దశలో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు.
అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా…
ఇవానా గృహ సముదాయాన్ని అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా నిర్మిస్తున్నట్టు అచ్యుతరావు తెలిపారు. ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌస్లు నిర్మిస్తున్నామని.. ఇవి కాక టవర్లపైన ఒక లక్ష చదరపు అడుగుల్లో గార్డెన్, స్విమ్మింగ్ పూల్తో పాటు 3 బేస్మెంట్ పార్కింగ్ల తరువాత ఒక ఫ్లోర్ మొత్తాన్ని చిన్నారులు, పెద్దల అవసరాల కోసం అనువుగా కేటాయించామని చెప్పారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయన్నారు.