మార్కెట్లకు భారీ ఉపశమనం

– సెన్సెక్స్‌ 1292 పాయింట్ల ర్యాలీ
ముంబయి: వరుసగా ఐదు సెషన్లలో నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వారాంతంలో భారీ ఉపశమనం లభించింది. క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ పెంపునతో విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించగా, ఇతర ఇన్వెస్టర్లు ఆదే బాటలో ఇటీవల పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించారు. దీంతో షేర్ల ధరలు దిగిరావడంతో తక్కువ ధరల వల్ల మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌్‌ 1292 పాయింట్లు (1.62 శాతం) పెరిగి 81,332 పాయింట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 428 పాయింట్లు (1.76శాతం) పెరిగి 24,834 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.16 లక్షల కోట్లు పెరిగి రూ.456.98 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌-30లో భారతీ ఎయిర్‌ టెల్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌ తదితర స్టాక్స్‌ అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.