అదుపుతప్పి జనంపై దూసుకెళ్లిన మిల్క్‌వ్యాన్‌

అదుపుతప్పి జనంపై దూసుకెళ్లిన మిల్క్‌వ్యాన్‌– ముగ్గురు మృతి..16 మందికి గాయాలు 
– సిక్కింలో రోడ్డు ప్రమాదం
గ్యాంగ్‌టక్‌ : రద్దీగా ఉన్న ప్రాంతంలో పాలట్యాంకర్‌ అదుపుతప్పి జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా,16 మందికి గాయాలయ్యాయి. సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‌టక్‌ జిల్లాలోని రాణిపూల్‌ మేళా మైదానంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సిక్కింగ్‌ రాజధాని గ్యాంగ్‌టక్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని రాణిపూల్‌ మేళా గ్రౌండ్‌లో టొంబోలా ఆడేందుకు జనం భారీగా వచ్చారు. అటుగా వచ్చిన ఓ పాల ట్యాంకర్‌ అదుపుతప్పి మైదానంలోని జనంపైకి దూసుకెళ్లింది. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మొత్తం ముగ్గురు మరణించినట్లయ్యింది. అయితే గాయపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.