నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేలు అమలు చేయాలని బి.ఎల్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్దిరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లోగల బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అనుసరిస్తున్న బహుజన కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కనీస వేతనాలు అమలు చేయడంలో వివక్ష చూపుతున్నాయని విమర్శించారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత పదకొండు సంవత్సరాలుగా కార్మిక వర్గానికి రక్షణ కవచంంగా ఉన్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి బహుజన శ్రామిక వర్గాన్ని పెట్టుబడిదారులకు, కట్టు బానిసలుగా మార్చిందని ఆరోపించారు. అక్టోబర్ లో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్టవ్య్రాప్తంగా ఆందోళనాలు నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్,నగర ప్రధాన కార్యదర్శి గంగా శంకర్, నగర ఉపాధ్యక్షులు విశ్వనాథ్ పాల్గొన్నారు.