ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అనే ఇతివత్తంతో ‘తల్లి మనసు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం గురించి నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ, ‘షూటింగ్ పార్ట్తోపాటు డబ్బింగ్, రీ రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని మా చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. సెన్సార్ పూర్తి చేసి ఈనెలలోనే విడుదల చేస్తాం. డబ్బింగ్, రీ రికార్డింగ్ దశలో పలువురు మా చిత్రాన్ని చూసి ఓ మంచి చిత్రాన్ని తీశారని ప్రశంసించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు కోటి కూడా చాలా మంచి చిత్రాన్ని నిర్మించారని అభినందించారు’ అని చెప్పారు. ‘మంచి కథ, కథనాలు ఒక ప్లస్ పాయింట్ అయితే, వాటిని తెరపైన తీర్చిదిద్దిన విధానం మరొక ప్లస్ పాయింట్. మాకు చాలా సంతప్తినిచ్చిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న నమ్మకం ఉంది’ అని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు. దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ‘ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురైందనే అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా తెరకెక్కించాం’ అని తెలిపారు.