సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

డైరెక్టర్‌ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్‌’. సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణు బాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కనిపిస్తుంది. తనకు నచ్చిన లైఫ్‌ స్టైల్‌లో జీవించే అమ్మాయి. అలాగే అశ్రిణ్‌ కూడా తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నా, బాగా నటించింది. రాజసం మన పుట్టుకతో వస్తుందని చెప్పే పాత్ర తనది. సాయి రోనక్‌ తన కెరీర్‌లో బెస్ట్‌ పర్మార్మెన్స్‌ ఇచ్చాడు. బాబా భాస్కర్‌ ది కీలక పాత్ర. సర్కిల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది’ అని చెప్పారు.