సూర్య తేజ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. వేసవి కానుకగా ఈనెల 5న ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో నిర్మాత పాయల్ సరాఫ్ మీడియాతో ముచ్చటించారు. ‘నాకు చిన్నప్పటి నుంచే గ్లామర్ ఇండిస్టీలో ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. అయితే నిర్మాత అవుతానని అనుకోలేదు. అనుకోకుండా ఇలాంటి మంచి అవకాశం వచ్చింది. చాలా మంచి కథ. ఇలాంటి మంచి కథతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాను. పిఆర్ ఫిలింస్ బ్యానర్ పై మా మొదటి సినిమాగా ‘భరతనాట్యం’ నిర్మించాం. ఇందులో చాలా మంది అద్భుతమైన నటీనటులు ఉన్నారు. వైవా హర్ష, హర్ష వర్ధన్, అజరు ఘోష్, సలీమ్ ఫేకు .. వీళ్ళంతా గత చిత్రాలకు భిన్నమైన పాత్రలలో కనిపిస్తారు. ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో కంటెంట్, క్యారెక్టర్స్ రొటీన్కి భిన్నంగా ఉంటాయి. దర్శకుడు కావాలని ప్రయయత్నించే ఓ కుర్రాడు.. ఆర్థికంగా ఫ్యామిలీ, లవ్ లైఫ్ నుంచి సమస్యలు ఎదుర్కొంటూ అనుకోకుండా క్రైమ్ వరల్డ్లో పడి, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనేది లైను. దర్శకుడు మహేంద్ర అమేజింగ్ పర్సన్. ఆయన ఈ సినిమా కోసం వందశాతం ఎఫెర్ట్ పెట్టారు. సినిమాని అద్భుతంగా తీశారు. నా మొదటి సినిమాకి మహేంద్ర లాంటి దర్శకుడు దొరకడం నా అదష్టం. కథ రాస్తున్నప్పుడే ఈ సినిమాకి మహేంద్ర దర్శకుడిగా అయితే బావుంటుందని సూర్య అనుకున్నారు. నిజానికి ఇది హీరో బేస్డ్ కథలా ఉండదు. నటీనటులంతా కథలో భాగం అవుతారు. అలాగే వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’.