తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్లు మరెవరూ ఆదరించరు అని మరోసారి రుజువు చేసిన చిత్రం ‘బలగం’. దిల్‌ రాజు సారథ్యంలో శిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్రలు, వాటి మధ్య భావోద్వేగాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు దర్శకుడు వేణు ఎల్దండికి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘సినిమాను వేణు చాలా బాగా డైరెక్ట్‌ చేశాడు. ‘బలగం’ నిజమైన మూవీ. సినిమాలో నిజాయితీ ఉంది. దిల్‌ రాజు వంటి కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌ ఉన్నప్పటికీ వేణు సినిమాకి న్యాయం చేశాడు. పక్కా నేెటివిటీ ఉన్న సినిమా. తెలంగాణ సంస్కతిని వేణు చక్కగా చూపించాడు. తను చిన్నప్పటి నుంచి చూసిన ప్రతీ విషయాన్ని ఇందులో చూపించాడు. గతంలో వేణు ఉగ్గు కథలు, బుర్ర కథలుపై ఓ జబర్దస్త్‌ షో చేసినప్పుడు చూశాను. నిజంగా వేణులో ఇంత టాలెంట్‌ ఉందా అని వేణుపై గౌరవం పెరిగిపోయింది. ‘బలగం’ సినిమాతో తను గొప్ప సినిమాను తీశాడనిపించింది’ అని చెప్పారు.