‘తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమ మూర్తిగానే కాదు త్యాగమూర్తిగా కూడా ఆమెకు సాటి రారు మరెవ్వరు. అలాంటి ఓ తల్లి మనసు ఎలాంటి భావోద్యేగాలకు గురైంది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాల సమ్మేళనంతో ‘తల్లి మనసు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దీని ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ తాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఇటీవల షూటింగ్ పార్ట్తోపాటు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ, ‘సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం. సోషల్ మీడియాలో గురువారం టీజర్ విడుదల చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని చెప్పారు. ‘మా బ్యానర్లో మంచి కథ, కథనాలతో ఓ చిత్రం చేయాలని సంకల్పించి, ఈ చిత్రం చేశాం. నవంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని సమర్పకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు. దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ‘ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథ ఇది. ఆమె ఎలాంటి సంఘర్షణలకు గురయ్యింది అనే అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేసేలా తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ).