– ప్రతి మండల, డివిజన్ స్థాయిలో టీమ్ల ఏర్పాటు
– క్షేత్రస్ధాయిలో పర్యవేక్షణ పట్టుబడితే పీడీ యాక్ట్ ప్రయోగం
– జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
– వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారుల
సమన్వయం సమావేశంలో పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి జిల్లాలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శనివారం ఖమ్మంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులలో విస్తృత తనిఖీలు, మండల, డివిజన్ స్థాయిలో కూడా టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో రంగంలో ఉంటాయని తెలిపారు. అలాగే పాత నేరస్తులపైనా నిఘా పెట్టామని, బైండోవర్స్ కూడా చేస్తామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పేర్కొన్నారు. కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తక్కువ ధరకు వస్తున్నాయని, తీసుకొని మోసపోతుంటారని, అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతుంటారని, ఇలాంటి దళారులను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టిన క్రమంలో పోలీస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో..మండల, డివిజన్ స్థాయితో పాటు జిల్లాలో తనిఖీలు విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎక్కువగా మండల కేంద్రంతో పాటు గ్రామీణ స్థాయిలో రవాణా జరిగేందుకు వీలుండడంతో అక్కడే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో నకిలీ విత్తన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్ కూడా చేయాలని అన్నారు. మళ్లీ కొత్తగా కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్ కలిగి ఉండి వేరేచోట విక్రయాలు జరిపే వారిపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఎక్సైజ్ సూపరిండెంట్ నాగిరెడ్డి, ఏసీపీలు గణేష్, భస్వారెడ్డి, రహెమాన్ , రామనుజం, ప్రసన్న కుమార్, వెంకటస్వామి, వేంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు కిశోర్ బాబు, పాల్గొన్నారు.