– కొండా లక్ష్మణ్ బాపూజీ.. సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొండా లక్ష్మణ్బాపూజీ ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి (సెప్టెంబర్ 27 ) సందర్భంగా, వారు తెలంగాణ కు అందించిన సేవలను, చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా ఎన్నో పదవుల ను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారన్నారు. బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదనీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం స్పష్టం చేశారు. వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టామనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థాన మే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని సీఎం అన్నారు.
సీఎంకు వైరల్ ఫీవర్, దగ్గు
– చికిత్సనందిస్తున్న వ్యక్తిగత వైద్యులు
సీఎం కేసీఆర్ గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం వ్యక్తిగత వైద్యులు ఆయనకు ఇంటివద్దనే చికిత్సనందిస్తూ పర్యవేక్షిస్తున్నారు. వైద్యుల చెబుతున్న దాని ప్రకారం… కొద్ది రోజుల్లోనే సీఎం పూర్తిగా కోలుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.