నవతెలంగాణ-మహదేవ్పూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం, సాంకేతిక, ఇంజినీరింగ్ నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది. ఇరిగేషన్ ఈఎన్సీ(అడ్మీన్) అనిల్కుమార్, నిపుణులు మొరం రాములు, దేశ్ సాయి నేతృత్వంలో డ్యాం సెఫ్టీ బృందం పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజ్ వద్దకు చేరుకొని 39 పియర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలన చేశారు. బ్యారేజ్ 4వ బ్లాక్లోని డౌన్ స్ట్రీమ్ 38,39 పియర్ల మధ్య గల వెంట్ వద్ద ఏర్పడిన సీపేజీను పరిశీలించి ఫొటోలు తీసుకున్నారు. బ్యారేజీ సమస్యలు, పలు అంశాలపై ఈఈ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లోని దెబ్బతిని, కుంగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నది గర్భంలో బ్యారేజ్ కిందికి వెళ్లి 20పియర్ పగుళ్లను, ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం, ఇసుక మేటలనూ పరిశీలించారు.