– పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు ప్రముఖులు
నవతెలంగాణ-కమ్మర్పల్లి
రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అంత్యక్రియలు శుక్రవారం వారి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో వేల్పూర్కు వచ్చి మంజులమ్మ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జజాల సురేందర్, హన్మంతు షిండే, షకీల్, విద్యాసాగర్ రావు, పలువురు అధికారులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మెన్లు, ఎంపీ ధర్మపురి అరవింద్, తదితర ముఖ్య నాయకులు హాజరై నివాళి అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు.