– 50 పడకలతో ఏర్పాటుకు మంత్రి ఆదేశం
– 72 మెడికల్ క్యాంపులు పెట్టాలని సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలందించేందుకు వీలుగా మేడారంలో తాత్కాలికంగా 50 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. జాతరలో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయ న అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా, డీఎంఈ డాక్టర్ త్రివేణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరుకుమార్, డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకలతో, స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర పరిసరాల్లో మొత్తం 30 మెడికల్ క్యాంపులు, జాతరకు పోయే రూట్లలో మరో 42 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలనీ, అవసరమైన అన్ని రకాల మెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచి ంచారు. జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల15 బైక్ అంబులెన్స్లు అందుబాటులో ఉంచుకుని పేషెంట్లను వీలైనంత త్వరగా మెడికల్ క్యాంపులు లేదా సమీపం లోని హాస్పిటళ్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మెడికల్ క్యాంపుల్లో చికిత్స చేశాక, ఇంకా ఉన్నతస్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్కు, వరంగల్ ఎంజీఎంకు తరలించి వైద్యం అందించాలని మంత్రి సూచించారు. జాతర ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు నుంచే మెడికల్ క్యాంపులు, ఆస్పత్రులను ప్రారంభించా లని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించాలని మంత్రి సూచించారు.