– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ప్రతి ఇల్లు సర్వే చేయాలని, ఓటరు జాబితా సవరణపై, యాప్ వినియోగంపై బూత్ లెవెల్ ఆఫీసర్లకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, ఫామ్ 6, 7, 8 దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా చూడాలని తెలిపారు. ఎ.ఆర్.ఓ లు, ఎ.ఇ.ఆర్.ఓ లు ప్రతి పోలింగ్ స్టేషన్ ను నిర్ణీత సమయంలో తనిఖీ చేయాలని సూచించారు. సర్వేలో కుటుంబాల వివరాలు, అడ్రస్ లు సరిగా పరిశీలించాలని, ఫోటోలు, అడ్రసులను, కొత్త పోలింగ్ కేంద్రాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించేలా రాజకీయ పార్టీలకు తెలుపాలని, డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జాబితాలను రాజకీయ పార్టీలకు అందించాలని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే పోలింగ్ స్టేషన్లను విజిట్ చేసి వివరాలు తెలుపాలని అన్నారు. తేదీ. 01-01-2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే ప్రతి ఒక్కరిని ముందస్తుగానే గుర్తించి ఓటరు నమోదు చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్, భువనగిరి రెవెన్యూ డివిజన్ అధికారి అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.