క్రికెటర్‌ త్రిషకు సన్మానం

– ఘనంగా సత్కరించిన బ్రియాన్‌ లారా
నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారత వర్థమాన క్రికెటర్‌, తెలంగాణ ముద్దుబిడ్డ త్రిష రెడ్డిని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) శనివారం ఘనంగా సత్కరించింది. శనివారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు త్రిషను హెచ్‌సీఏ సముచితంగా గౌరవించింది. కరీబియన్‌ క్రికెట్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చీఫ్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా చేతుల మీదుగా జ్ఞాపిక అందజేసింది. గత ఏడాది ఐసీసీ అండర్‌-19 మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలుచుకున్న భారత జట్టులో త్రిష రెడ్డి కీలక భూమిక వహించింది. అద్భుత ప్రతిభ కనబరిచిన త్రిష రెడ్డి ఆ టోర్నీలో ఉత్తమ వర్థమాన క్రికెటర్‌గా సైతం నిలిచింది. భద్రాచలం అమ్మాయిని ఉప్పల్‌ స్టేడియానికి హెచ్‌సీఏ ఆహ్వానించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏకసభ్య కమిటీ ఛైర్మన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, హెచ్‌సీఏ సీఈవో సునిల్‌ కంతేర్‌, హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు త్రిషాను అభినందించారు.