– వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1 అయితే, ఏ2 బీజేపీ అని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇటీవల కేంద్రీయ విద్యాలయాలు ప్రకటిస్తే వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. కేంద్రీయ విద్యాలయం కూడా ఇవ్వని మోడీ ఏం చెప్పేందుకు తెలంగాణ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తాండూర్ రూ.50కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇటు పక్క చించోలి అటు పక్క సేడం పట్టణాలు ఉన్నాయని, వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఆ రెండు పట్టణాల్లో అభివృద్ధి చూడండన్నారు. పీఎం సొంత రాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీల జీతం రూ.6 వేలే ఇస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ, ఆశావర్కర్లకు కర్నాటకలో కంటే మన దగ్గరే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. త్వరలో పీఆర్సీ నోటిఫికేషన్ వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.