నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
కష్టపడి చదివి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. డీఎస్సీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలలో జిల్లాకు చెందిన కానిస్టేబుల్ షేక్ ఇంజమాముల్ హక్ చెల్లెలు షేక్ షిరీన్ పర్వీన్ రాష్ట్రంలోనే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలోని ఉర్దూ మీడియంలో 80.03 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని డీఎస్సీ ఎస్జీటీలో 79 మార్కులతో రెండో స్థానాన్ని సాధించిందన్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, డీఎస్సీలలో మొదటి స్థానాలను సాధించిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం పోలీస్ కార్యాలయంలో విద్యార్థినిని శాలువాతో సత్కరించి, బహుమతిని ప్రధానం చేసి అభినందించారు. మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించి కుటుంబ సభ్యుల పేరును జిల్లా పోలీసుల కీర్తిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లాలని సూచించారు. అన్నయ్య ఒకవైపు ఉద్యోగం చేస్తూ, కుటుంబ బాధ్యతలను మోస్తూ చెల్లెలు చదువుకు కావాల్సిన వాటిని అందిస్తూ తనను ప్రోత్సహించడం జరిగిందని, విద్యార్థిని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఏఎస్సై జైస్వాల్ కవిత, కుటుంబ సభ్యులు తండ్రి మెహబూబ్, అన్నయ్య షేక్ ఇంజమాముల్ హక్, తమ్ముడు ఇమ్రాన్, నజీర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.