న్యూఢిల్లీ : సిమెంట్ పరిశ్రమ రంగంలో గౌతం అదానీ ఏకచత్రా దిపత్యానికి మార్గం సుగమం చేసుకుం టున్నారు. క్రమంగా ఒక్కో కంపెనీని కొనుగోలు చేస్తూ పోతున్నారు. తాజాగా ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్లో 46.8 శాతం వాటాలను స్వాధీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. అదానీ గ్రూపులోని అంబూజా సిమెంట్స్ ద్వారా ఓరియంట్ సిమెంట్లో 46.8 శాతానికి సమానమయ్యే వాటాను రూ.8,100 కోట్లకు కొనుగోలు చేయనున్నారు. ప్రమోటర్ల నుంచి 37.9 శాతం, పబ్లిక్ నుంచి అదనంగా 8.9శాతం కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.
మరో 26శాతం వాటా కోసం ఆఫర్ ఫర్ సేల్కు వెళ్లాలని యోచిస్తోంది. దీంతో ఆ సంస్థలో మెజారిటీ వాటాను సాధించు కోనుంది. ఈ కొనుగోలుతో 2025 నాటికి ఏటా ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరనుందని అంబుజా సిమెంట్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొ న్నారు. అంబుజా, ఎసిసి సిమెంట్స్లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. 2028 ఆర్థిక సంవత్సరానికి దేశీయ సిమెంట్ మార్కెట్లో తన వాటాను 20శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. 2028 నాటికి ఏటా ఉత్పత్తిని 140 మిలియన్ టన్నులకు చేర్చాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్ ప్రవేశంతో సిమెంట్ వ్యాపారంలో అనేక కంపెనీలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.