– భూ కబ్జాలపై హైకోర్టు డైరెక్షన్ ను ప్రభుత్వం అమలు చేయాలి
– ధరణి బాధితులకు న్యాయం చేయాలి, టి సీపీఐ జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య
నవతెలంగాణ-శాయంపేట : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి కబంధహస్తాల్లో ఉన్న భూమిని బాధితులందరికీ ఇప్పించే ప్రయత్నం చేయాలని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రభావతికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు ఈ నెల ఒకటి నుండి తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియను కొన్నింటి పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ధరణి దరఖాస్తులు అన్నింటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేశారు. భూ కబ్జాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ను రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయుటకు పూనుకోవాలని, బాధితులందరికీ వారి భూములు అందే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ధరణి స్పెషల్ డ్రైవ్ 9వ తారీకు తో ముగింపు చేయకుండా నిరంతరం కొనసాగిస్తూ భూ బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జేమ్స్, మండల నాయకులు ఆడేపు అశోక్ పాల్గొన్నారు.