– మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్, ఎస్ఐ నవీద్ ఖాన్
నవతెలంగాణ – మాగానూర్
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని క్రిష్ణ మండల ఎస్ఐ నవీద్ ఖాన్, మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్లు హెచ్చరించారు. ఆదివారం మాగనూరు మండల కేంద్రంలో మాగనూర్ రైతు వేదికలో కష్ణ మరియు మాగనూరు మండలాలకు సంబంధించిన వ్యవసాయ, పోలీసు శాఖ మరియు రెవెన్యూ శాఖల సంయుక్త ఆద్వర్యంలో విత్తన డీలర్స్కు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో విత్తన డీలర్స్ కు విధిగా పాటించాల్సిన కొన్ని నియమాలను సూచించారు. షాప్ పేరు డోర్ నెంబర్ కనిపించే విధంగా ఉంచాలన్నారు. సీడ్ లైసెన్స్ కొనుగోలు దారులకు కనిపించేవిదంగా పెట్టా లన్నారు. ధరల పట్టిక రైతులకు కనిపించేవిదంగా ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ చేయరాదని హెచ్చరించారు. అలాగే నిషేధిత వితనాలైన బీ టీి -3 విత్తనాలు ఎవరైనా అమ్మితే పోలీస్, వ్యవ సాయ అధికారులకు తెలియజేయాలని కోరారు. కష్ణ తహసీల్దార్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డీలర్లు విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మాగనూరు తహసీ ల్దార్ సతీష్ మండలంలో ఎవరైనా లైసెన్స్ లేని వారు రైతులకు లూజ్ విత్తనాలు లేదా అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గంటల తరబడి రైతులను షాపుల ముందు నిలబడేటట్టు చేయకూడదన్నారు. మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే వాన కాలం సంబంధించి తహసీల్దార్, ఎస్ఐ , మండల వ్యవసాయ అధికారులు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పడి వివిధ డీలర్ల షాపులను తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని డీలర్లు చట్ట ప్రకారం విత్తనాలు, ఎరువులను విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాగనూరు మండల ఏఎస్ఐ , కష్ణ , మాగనూరు మండలల ఏఈవోలు, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.