గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు

– దాన్నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీలో చక్కర్లు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ-రేస్‌ స్కామ్‌ నుంచి తప్పించుకొనేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారని తెలిపారు. గవర్నర్‌ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్‌ ఇక్కడికి వచ్చారని చెప్పారు. అవినీతి పార్టీ బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్‌, ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని సీఎం ప్రశ్నించారు. బీజేపీ -బీఆర్‌ఎస్‌ చీకటి బంధం బయటపడుతుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
”అమృత్‌ టెండర్లపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు. సృజన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి అల్లుడే. బీఆర్‌ఎస్‌ హయాంలో సృజన్‌ రెడ్డికి రూ.వేల కోట్ల పనులు కేటాయించారు. అమత్‌ టెండర్లలో అవినీతి జరగలేదని ఉపేందర్‌ రెడ్డే చెప్పారు. ఈ టెండర్ల గురించి ఇష్టమొచ్చిన చోట మొరపెట్టుకో కేటీఆర్‌. కోర్టుల్లో కేసులు వేస్తామన్నా.. వేసుకోండి” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడిని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులు ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. దాడులు చేసిన వారినీ, చేయించిన వారినీ, ఎవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగితే సమర్థిస్తారా? అధికారులపై దాడులను బీఆర్‌ఎస్‌ ఎందుకు ఖండించదు? అని ప్రశ్నించారు. పైగా దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారనీ, దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటే.. బీజేపీకి సహకరించినట్టు కాదా? అని సీఎం ప్రశ్నించారు.