బీఆర్‌ఎస్‌లో చేరికలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలుగుదేశం పార్టీ పాలకుర్తి ఇన్‌చార్జీతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌ó జాటోత్‌ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్‌, గుగులోతు నరేశ్‌, కుర్వ శివ, ఎడవెల్లి నవీన్‌, పల్లేర్ల వెంకటేశ్‌, కుర్ర దేవి తదితరులు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సిరిపాటి ఎల్లస్వామి, సిరిపాటి మహేశ్‌, ఉప సర్పంచ్‌ తరాల చంద్రబాబు, వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన రీతిలో సముచిత గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. వాళ్లంతా గ్రామాభివృద్ధికి పాటుపడాలనీ, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేయాలని చెప్పారు.