– కౌంట్డౌన్ షురూ…
– సూర్యునిపై ప్రయోగానికి ఇస్రో సిద్ధం
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి సూర్యునిపై ఇస్రో ప్రయోగం చేయనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. 23 గంటలకు పైగా ఈ కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. శనివారం (సెప్టెంబరు 2) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్ -1 ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్స్, వాహన అంతర్గత తనిఖీలు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంలో సూర్యుని వివరణాత్మక అధ్యయనం కోసం ఏడు వేర్వేరు పేలోడ్లను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుని నుంచి వచ్చే కాంతిని గమనిస్తాయి. మిగిలిన మూడు ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాలను కొలుస్తాయి. ఆదిత్య ఎల్-1లో అతిపెద్ద సాంకేతిక సవాల్గా ఉండే పేలోడ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ (వీఈఎల్సీ) దీన్ని పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. భూమికి 1.5 మిలియన్ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 (లేదా ఎల్1) చుట్టూ ఒక హాలో కక్ష్యలోకి ప్రయోగించబడుతుంది. ఈ కక్ష్య నుంచి సూర్యునికి చేరేందుకు సుమారు నాలుగు నెలలు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగంలో అంతరిక్ష నౌక సౌర విస్ఫోటనం, సంఘటనలకు దారితీసే ప్రక్రియల క్రమాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అంతరిక్ష వాతావరణంపై లోతైన అవగాహనకు ఈ ప్రయోగం దోహదం చేయనుందని ఇస్రో వెల్లడించింది. సోలార్ కరోనా యొక్క భౌతిక శాస్త్రం, దాని పని విధానం, సౌర గాలి, ఉష్ణోగ్రత, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణం వంటి విషయాలను తెలుసుకునే లక్ష్యాలుగా సన్ మిషన్ ప్రయోగం జరగనుందని ఇస్రో పేర్కొంది.