– ప్రశ్ననే ప్రగతికి మూలం : జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రజలు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని, ప్రశ్ననే ప్రగతికి మూలం అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు అన్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం రాష్ట్రస్థాయి వర్క్షాప్, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు కన్వీనర్ రాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో నవంబర్ 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు సైన్స్ ఎగ్జిబిషన్లను జాతీయ శాస్త్రీయ దృక్పథంతో నిర్వహిస్తున్నారన్నారు. నవంబర్లో రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు రిలీజ్ చేసి 60 సదస్సులు నిర్వహించారని తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోగాలు నేర్పిస్తారన్నారు. ప్రజల లో శాస్త్రీయ బలాన్ని పెంపొందించ డం ప్రశ్నించే తతత్వాన్ని అలవాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రతి విషయాన్నీ బట్టీ పట్టడం కాకుండా పూర్తిగా అన్వేషించి అర్థం చేసుకోవాలని చెప్పారు. సైన్స్ను మార్కుల కోసం కాకుండా ప్రయోగాలతో నేర్చుకోగలిగితే సులభంగా అర్థమవుతుందన్నారు. నిత్యం జీవిత ఘటనలలోంచి సైన్స్ సూత్రాలను తెలుసుకోవడం విద్యార్థులు లక్ష్యంగా మార్చుకోవాలని సూచించారు. అందుకోసం జనవిజ్ఞాన వేదిక శిక్షణ అందిస్తుందన్నారు.