నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, అర్హత లేని వారికి కేటాయించిన ఇండ్లను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోతె మండలం విభలాపురం, అప్పన్నగూడెం గ్రామపంచాయతీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని అర్హత లేని వారి ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభలాపురం, అప్పన్నగూడెం గ్రామపంచాయతీల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మొదటి లిస్టులో అర్హులైన పేదలను ప్రభుత్వం అధికారులు గుర్తించాలని గుర్తించిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా విభలాపురం, రావిపహాడ్ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అధికారులు కుమ్మక్కై ఒక్క ఇంటికి రూ.70000 నుండి లక్ష రూపాయల వరకు అక్రమంగా అర్హత లేని వారి దగ్గర డబ్బులు తీసుకొని అర్హత లేని వారికి ఇండ్లు మంజూరు చేయించారని విమర్శించారు.ఈ విషయమై అనేకసార్లు కలెక్టర్,ఆర్డీఓ, తహసీల్దార్కు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విభలాపురం, అప్పన్నగూడెం గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించి అర్హత లేని వారిని తొలగించి అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.కొంతకాలంగా పేదలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.ఓట్లు వేసిన ప్రజల పైన ఏమాత్రం గౌరవం ఉన్న ఈ గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో జరిగిన అక్రమాలపై స్వయంగా ఎమ్మెల్యే విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ అధికారి రామిరెడ్డికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మోతె మండల కార్యదర్శి మల్కూరి గోపాల్ రెడ్డి, ,నాగం మల్లయ్య,బూడిదలింగయ్య,వెలుగు మధు,చేగువేరా, బోర్రాజు ఎల్లయ్య, వీరమల్ల వెంకట్, పెరుమాండ్ల నాగమణి, కళ్ళపల్లి సుగుణమ్మ, పులిగుజ్జు ఉప్పమ్మ,తురకరమేష్, కొండ రమణ,గోపి, రమణ, విజయ, సండ్ర ఉప్పలమ్మ, రజిత, మధు, నిర్మల, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.