అందరి చూపు కర్నాటక వైపు..

నేడే ఎన్నికల ఫలితాలు
– ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
– మధ్యాహ్నానికే పూర్తి ఫలితాలు?
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించనున్నారు. దేశ రాజకీయాల్లో కీలకమైన కర్నాటక ఎన్నికల వైపే అందరిదృష్టి కేంద్రీకృతమైంది. హంగ్‌ వస్తుందని, కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుందని సర్వేలు వెల్లడించాయి. దీంతో ఇటు
రాజకీయాల్లోనూ, అటు దేశ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నెల 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో కర్నాటక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 73.19 శాతం ఓటింగ్‌ నమోదయింది. దీంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుని ఉంది. ఎన్నికల్లో వినియోగించిన ఇవిఎంలను పటిష్ట భద్రతతో స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. శనివారం జరిగే ఓట్ల లెక్కింపు కోసం కర్ణాటక వ్యాప్తంగా 36 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికే ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఫలితాలపై మూడు ప్రధాన పార్టీలూ ఆశాజనకంగా ఉన్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ (113) కంటే ఎక్కువ స్థానాలను సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ధీమాగా చెబుతున్నాయి. సీపీఐ(ఎం) నాలుగు స్థానాల్లో పోటీ చేసింది.