– కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ అబద్ధాలేనని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హోటల్ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. కర్నాటకలో రూ.3 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉచిత బియ్యం, గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలను కూడా సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ను కాంగ్రెస్ కు ఏటీఎం కానివ్వబోమని చెప్పారు. యువతకు ఉద్యోగాలిస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు రావనీ, అభివద్ధి జరగదని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే బీజేపీ మూల సిద్ధాంతమన్నారు. దేశవ్యాప్తంగా బీసీ లీడర్షిప్ను తమ పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు.