హైదరాబాద్: అమెరికా అండర్-19 మెన్స్ క్రికెట్ జట్టుకు ఎంపికైన నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన సూదిని నితీశ్ రెడ్డిని టీడీసీఏ ప్రెసిడెంట్, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన సూదిని నితీశ్ రెడ్డి క్రికెట్లో రాణిస్తున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఓ ఆటగాడు అమెరికా క్రికెట్ జట్టులో ఆడటం ఎంతో సంతోషం. నితీశ్ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్లు జాతీయ జట్టులోకి రావాలని ఆకాంక్షిస్తున్నానని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సూదిని విక్రమ్ రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా టీడీసీఏ కన్వీనర్ సురేందర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం అమెరికా బయల్దేరనున్న నితీశ్ రెడ్డి.. అక్కడ్నుంచి యుఎస్ఏ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు.