– సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్
నవతెలంగాణ-ముదిగొండ
భారతదేశంలోని ప్రజలందరికీ ఆర్థిక సమానత్వం ఉండాలని పోరు చేసిన గొప్ప మేధావి అంబేద్కర్ అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్ అన్నారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని వెంకటాపురం ఆర్కే గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన అంబేద్కర్ జీవితచరిత్ర నాటకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజల హక్కులకై ఉద్యమించిన సామాజికోద్యమ విప్లవకారుడున్నారు. అసమానతులకు వ్యతిరేకంగా సమానత్వంగా ఉండే సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ దళితులకే పరిమితం కాదని, ఆయన అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేశారన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన, పరిశ్రమలు జాతీయం చేయాలని, ప్రజలంతా సమిష్టి వ్యవసాయం చేయాలని అంబేద్కర్ కలలగన్నా రన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, కమ్యూనిస్టులకు అనుగుణంగా ఉన్నాయన్నారు. అంబేద్కర్ నాటకం దేశంలోని ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించే అంబేద్కర్ నాటక ప్రదర్శన కళాకారులు ప్రజలను జాగృతం చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా నాయకులు బండి పద్మ, వాసిరెడ్డి వరప్రసాద్, సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు మందరపు వెంకన్న, పద్మావతి, పయ్యావుల పుల్లయ్య, ప్రభావతి, రాయల శ్రీనివాసరావు, మంకెన దామోదర్, కందుల భాస్కరరావు, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు, మెట్టెల సతీష్, కటారి హుస్సేన్, నెమిలి సైదులు, పుచ్చకాయల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన అంబేద్కర్ నాటకం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలపై ప్రజానాట్యమండలి నేత దేవేందర్ రచించిన అంబేద్కర్ నాటకం కళాకారుల ప్రదర్శన తీరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకొని ఆలోచింపజేసింది. అంబేద్కర్ చదువుకునే రోజుల్లో ఎన్ని అవమానాలు, కుల వివక్షతకు గురైన విధానం, ఆయన ప్రజల కోసం చేసిన ఆలోచనలు, సమాన హక్కులు, రిజర్వేషన్లు కోసం చేసిన కృషి వివరిస్తూ అంబేద్కర్ చరిత్రను కళ్లకు కట్టినట్టు కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు, చిన్నారులు, మహిళలు, కార్మికులు అంబేద్కర్ అభిమానులు అధికసంఖ్యలో హాజరై అంబేద్కర్ నాటికను తిలకించి విజయవంతం చేశారు.