– జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాఠశాలల్లో అకస్మిక తనిఖీ
నవతెలంగాణ-కొడంగల్
అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ, అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టే పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలనీ, పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, జూనియర్ కళాశాల, గోకాఫసల్ వాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దేవర ఫసల్ వాద్ ప్రాథమికోన్నత పాఠశాలలను అకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ అమ్మ, ఆదర్శ పాఠశాలలో పెండింగ్ ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా తాగునీరు, టాయిలెట్స్, మైనర్ మేజర్ రిపేర్లు, బాలికల కోసం టాయిలెట్స్, విద్యుద్దీకరణ పనులు ఇప్పటివరకు ఎన్ని పూర్తైనవీ ఎన్ని, ఇంకా చేపట్టాల్సివని ఎన్ని, ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తి చేశారు, ఇంకా చేయాల్సిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్లాసు రూమ్స్,టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, కిచెన్ షెడ్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, పాన్స్, లైట్స్ అన్నింటిని పరిశీలించారు. మిషన్ భగీరథ వాటర్ సప్లరు పైపు లైన్లను పరిశీలించారు. బోర్ల మరమ్మతులు వస్తే వెంటనే మరమతులు చేయించాలన్నారు. ప్రతీ పాఠశాల భవనం పై భాగంలో నీరు నిలువ లేకుండా తగు చర్యలు తీసుకుని పనులు నిర్వహించాలని సూచించారు. ఉన్న నిధులల్లోనే పనులు పూర్తి చేయాలనీ అధికారులను తెలిపారు.
అనంతరం దౌల్తాబాద్ ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ సెక్రటరిలు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ మీ పరిధిలో ఉన్న పాఠశాలలకు సంబం ధించిన పనులు మౌలిక వసతులు తాగునీరు, మరుగు దొడ్లు, ప్యాన్స్, మేజర్, మైనర్ రిపేరు పెండింగ్ ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలనీ ఆదేశించారు. కలెక్టర్తో పాటు ఎంపీడీవో విజయలక్ష్మి , తహసీల్దారు విజయ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.