– బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడి
ముంబయి: భారత క్రికెటర్లు, వర్థమాన క్రికెటర్లు సహా ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం బీసీసీఐ వినియోగించిన ఆధునాతన అథ్లెట్ మానిటరింగ్ సిస్టమ్ (ఏఎంఎస్)ను ఇక నుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సైతం అందించనున్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలు 50 మంది క్రికెటర్లు (25 మంది పురుషులు, 25 మంది మహిళలు) కోసం ఏఎంఎస్ను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఓ ప్రత్యేక బృందాన్ని నియమించనున్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాల తరఫున ఏఎంఎస్ ఖర్చును పూర్తిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భరించనుంది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రాసిన లేఖలో జై షా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్గా జై షా బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే.