జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన ఆదర్శ కళాశాల విద్యార్థి

నవతెలంగాణ-దౌల్తాబాద్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న అండర్ -19 జాతీయ స్థాయి హాకీ  పోటీలకు ఆదర్శ కళాశాల దౌల్తాబాద్ విద్యార్థి కే. అనిల్ కుమార్ ఎంపిక కావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ తెలియజేశారు. సోమవారం దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నల్గొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈనెల 29 వ తేదీ నుంచి జార్ఖండ్ రాష్ట్రం  రాంచీలో జరిగే పోటీలలో తెలంగాణ హాకీ జట్టు తరఫున పాల్గొంటారని తెలియజేశారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి కళాశాలకు, దౌల్తాబాద్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పట్టుదలతో ఏమైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. కళాశాల విద్యార్థి  జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేవిధంగా మంచి శిక్షణ ఇచ్చిన పాఠశాల పిడి సురేష్ ను ఎంపికైన విద్యార్థిని కే. అనిల్ కుమార్ ను  అధ్యాపక బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు.