ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

An RTC bus hit a parked lorry– ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం అందోల్‌ మైసమ్మ దేవాలయం దగ్గర హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్ట జి.మన్మధ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సాయంత్రం 4గంటల సమయంలో 50మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. దండుమల్కాపురం అందోల్‌ మైసమ్మ దేవాలయం దగ్గరికి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢకొీట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్‌ సలీంపాష(50) అందులో ఇరుక్కుపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ సలీంపాష సొంతూరు చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామం. ఉద్యోగ రీత్యా కుటుంబంతో కలిసి నల్లగొండలో ఉంటున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.