దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

– జర్నలిస్టులపై ఉపా చట్టం అది ప్రాథమిక హక్కులకు భంగమే
– మీడియా స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే
– న్యూస్‌క్లిక్‌కు మద్దతుగా జర్నలిస్టుల నిరసన ర్యాలీలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జర్నలిస్టులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తారా? ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు. పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో న్యూస్‌క్లిక్‌ మీడియా సంస్థపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ గురువారం హైదరాబాదులో ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌, టీయూడబ్ల్యూజే దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మీడియా సంస్థ లు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదాన్ని నిరసిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జర్నలిస్టులు గర్జించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబద్దార్‌, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడు దాం, రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం అంటూ జర్నలిస్టులు చేసిన నినాదాలు మారుమ్రోగాయి. ఆయా ప్రజా సంఘా లు, సామాజిక కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు.. అనంతరం ట్యాంక్‌ బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. కేంద్రంలో ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడమేంటని ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ కార్యాలయంపై, అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడిన తీరు దిగ్బ్రాంతి కలిగిస్తున్నదన్నారు. ఎందుకు సోదాలు జరుపు తున్నారో, ఎందుకు అరెస్టులు చేస్తున్నారో తెలపకుండా చీకటి రోజులను గుర్తు చేసేలా ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీ సులు వ్యవహరించారని విమర్శించారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్న పోలీ సులు ముందుగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయడం లేదో చెప్పడంలేదని ప్రశ్నించారు. చైనా పెట్టుబడులను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని హరించాలని చూస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1975లో ప్రకటిత ఎమర్జెన్సీ అమలు కాగా నేడు నరేంద్ర మోడీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న నిర్బంధకాండ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ లేని బతుకు అర్థరహితమన్నారు. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దురదష్టక రమన్నారు. సీనియర్‌ సంపాదకులు కె రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్య్రంపై జరుగు తున్న దాడులను ప్రతిఘటించడానికి జర్నలిస్టులంతా సమైక్య పోరాటం సాగించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్‌ చంద్రకుమార్‌, ఐఏఎస్‌ మాజీ అధికారి ఆకునూరి మురళి, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం, విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌.వి.రామారావు, సియాసత్‌ సంపాదకులు అమీర్‌ అలీ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్టులు కట్టా శేఖర్‌ రెడ్డి, వీక్షణం వేణు, పాశం యాదగిరి, గాయకులు జయరాజ్‌, సామాజిక నిపుణులు రమా మేల్కొటే, సజయ, ఉమెన్‌ అండ్‌ ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ ఇంచార్జి సంధ్య, ఓపీడీఆర్‌ నేత జయ వింధ్యా ల, మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్‌ కుమార్‌, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్‌, కే.విరాహత్‌ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి, చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యూసుఫ్‌ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్‌ అసోసియే షన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్‌, కేఎన్‌. హరి, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు వేణుగోపాల్‌ నాయుడు, సీపీఐ(ఎంఎల్‌ న్యూడెమెక్రసీ) నేత గోవర్ధన్‌తోపాటు 300 మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.