ఇంకా ముఖ్యమంత్రి కేసీఆరే..!

ఇంకా ముఖ్యమంత్రి కేసీఆరే..!– ఆదర్శ పాఠశాలలో మారని విద్యాశాఖ బోర్డు
– పేరు మార్పు చేయడంలో బహిర్గతమైన సిబ్బంది నిర్లక్ష్యం
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు జరిగి సుమారు రెండు నెలలు గడుస్తున్నా పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్డుపై ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే యథావిధిగా కొనసాగిస్తుండటం విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా బహిర్గతమవుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా పేరు గడించిన ఆదర్శ విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం మండలంలో పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లి ఆదర్శ విద్యాలయంలో విద్యాశాఖ బోర్డుపై ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లను మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తుండటం సిబ్బంది నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఆదర్శ విద్యాలయ సిబ్బంది ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి విద్యాశాఖ బోర్డుపై పేర్లను మారుస్తారా లేకా యథావిధిగా కొనసాగిస్తారా వేచి చూడాల్సిందే.