మరి అక్రమంగా జైల్లో మగ్గుతున్న వారి మాటేమిటి?

And what about those who are languishing in jail illegally?ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో (ఈ వ్యాసం రాసేనాటికి) అన్ని సౌకర్యాలతో ‘మగ్గుతున్నారు’. ఇదే సీను గత కొద్ది నెలల క్రితం తమిళనాడులో ఒక మంత్రి సెంథిల్‌ బాలాజీ విషయంలోను, అంతకుముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా విషయంలోనూ చూసాం. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవిత విషయంలోనూ అరెస్టు హైడ్రామా నడుస్తోంది. నిజానికి ఇటువంటి రాజకీయ కక్షలు, కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిప్పడం, మన దేశానికి, రాష్ట్రానికి గాని కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలలో ఉన్న ప్రముఖ నాయకుల మీద కేసులు పెట్టడం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారిపై లేక ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నాయకులపై తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థల ద్వారా కేసులు పెట్టడం కూడా గతం నుండి వస్తున్న రివాజే. అయితే ఫాసిస్టు తరహా పరిపాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీ సర్కారు పాలనలో ఇది మరింత వేగం పుంజుకుంది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని పాలకపక్షం అంటుంది. కాదు ఇదంతా రాజకీయ కక్ష అని ప్రతి పక్షాలంటున్నాయి. ఇందుకు ఈ పార్టీలన్నీ లాయర్లకు ఇచ్చే ఫీజులు చూస్తే తల తిరిగిపోతుంది. రోజుకు కోటి రూపాయల ఫీజు తీసుకునే లాయర్లు అటు ఇటు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏది ఏమైనా ఏ కేసులు (ఒక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తప్ప) దాదాపు నిలబడవు. అసలు కేసులే ఏండ్ల తరబడి నడుస్తుంటాయి. తీర్పులు వచ్చే నాటికి పరిస్థితి మారిపోతుంది. వాటిపై ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది. కానీ ఈ తతంగం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ప్రజలు ప్రేక్షకులుగా మిగిలిపోతూనే ఉంటారు.
రాజ్యం నిజ స్వరూపం
ఈ గందరగోళం మధ్య రాజ్యం నిజస్వరూపం తెలుసుకోవడం కష్టం. పాలక పార్టీల కోరిక, ప్రయత్నం కూడా అదే. ఈ క్రమంలో చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి మధ్యతరగతి, ఉన్నత వర్గాలలో పెద్ద చర్చే జరుగుతుంటుంది. తప్పు చేసిన వాడు ఎన్నటికీ తప్పించుకోలేడని, చట్టం ముందు అందరూ సమానులేనని, కింది కోర్టులో కాకపోతే పైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరి స్తుంటాయని, రాజకీయ ప్రలోభాలకు లోనుకావని… ఇలా అనేక వాదనలు ముందుకు తేబడుతూ ఉంటాయి. రాజ్యం యొక్క అసలు వర్గ స్వభావం గురించి చర్చ కనపడనివ్వరు. ఈరోజు భారతదేశంలో కనీసం ఒక వంద మంది ప్రముఖులు ఇందులో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రిక విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు మాత్రమే కాకుండా కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 90శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, కవి రచయిత వరవరరావు, విద్యావేత్త ఆనంద్‌ తేల్తుంబ్డే, రోనా విల్సన్‌, గౌతమ్‌ నవలఖ, సాగర్‌ గోర్కే, మీరన్‌ హైదర్‌ వంటి వారి మీద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే రాజ్యం పక్షపాత వైఖరి అర్థమవుతుంది. వారంతా ప్రభుత్వాలను కూలదోసేవారుగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని తుపాకీతో స్వాధీనం చేసుకుంటారని వారిపై ప్రధాన అభియోగం. చంద్రబాబులు, సిసోడి యాలు, కవితలు బాలాజీల మీద పెట్టిన అభియోగాలు వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని. కానీ అణగారిన, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల గురించి మాట్లాడే వాళ్లు, రాసేవాళ్లు, పాడేవాళ్లు, ఉద్యమించే వాళ్లు మాత్రం ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు చేసేవారుగా రాజ్యం ముద్ర వేస్తుంటుంది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తదనంతరం ఏడేండ్లలో ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేయబడ్డవారు 10,552 మంది. ఇందులో దోషులుగా కోర్టులు నిర్ధారించింది కేవలం 98 మంది మాత్రమే. కానీ వేలాదిమంది బెయిల్‌ రాక నెలలు, సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు, ఇంకా మగ్గుతున్నారు. మహమ్మద్‌ ఇలియాస్‌, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఇద్దరు 30ఏండ్ల యువకులు. వీరికి లష్కర్‌ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ గతంలో అరెస్టు చేసింది. తొమ్మిదేండ్ల తర్వాత విచారణలో వారికి అటువంటి సంబంధాలు ఏమీలేవని తేల్చి విడుదల చేసింది. అలాగే మహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌ అనే ఢిల్లీ యువకుడిని పాకిస్థాన్‌ ఏజెంట్‌ అని ముద్రవేసి 23సంవత్సరాలు జైల్లో పెట్టి చివరికి నిర్దోషి అని విడుదల చేసింది. ఇలా అనేకమంది యువకులను బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానీ, మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కానీ తల తోక లేని కేసులు పెట్టడం, ఏండ్ల తరబడి బెయిల్‌ ఇవ్వకుండా, అసలు విచారణే లేకుండా జైల్లో దుర్భరమైన పరిస్థితులకు వారి జీవితాలకు బలి చేయడం ఒక ధోరణిగా సాగుతున్నది. విలువైన వారి యవ్వన జీవితమంతా నాశనం చేయబడుతున్నది. కానీ వారి గురించి చర్చ ఎక్కడ కనపడదు. అలాగే పత్రికావిలేకరులు కూడా అత్యంత అన్యాయంగా బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ప్రభుత్వం, పోలీస్‌శాఖ ఒక దళిత మహిళను అంతం చేసిన తీరును కవర్‌ చేసినందుకు సిద్ధికి కప్పన్‌ ఎంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొనేలా చేసిందో ఈ రాజ్యం మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లకు, అందులో వారు పాలకవర్గాల మనుషులైతే వారిని రాజ్యం చూసే తీరుకు, ప్రభుత్వం మీద అణగారిన ప్రజల కోసం, సాంఘిక న్యాయం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం, పోరాడే ఉద్యమకారులను పరిగణించే తీరుకు ఉన్న తేడా రాజ్యం వర్గ ధోరణిని వ్యక్తం చేస్తున్నది.
చట్టం కొందరికి చుట్టమే…
ఈ చట్టం ఎవరికీ చుట్టం కాదు అనేది ఒక నానుడి మాత్రమే. పాలక పార్టీలు తిట్టుకోవడానికి ఉపయోగ పడే నినాదం మాత్రమే. చట్టం లేక రాజ్యం పాలకవర్గానికి కచ్చితంగా చుట్టమేనని దేశంలో జరుగుతున్న పై వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ‘ఉపా’ చట్టం పరిధిలో 2019లో 1948 మందిని అరెస్టు చేస్తే శిక్ష పడింది 34 మందికే. 2020లో 1321 మందికి అరెస్టు చేస్తే 80 మందికి మాత్రమే శిక్ష పడింది. 2021 లో 1621 మందిని అరెస్టు చేస్తే కేవలం 62 మందికి మాత్రమే శిక్ష పడింది. 2022-23 సంవత్సరాలలో కూడా బహుశా ఇదే ధోరణి కొనసాగుతూ ఉన్నది. 2019లో విచారణ పెండింగ్‌లో ఉన్న 2224 మందిలో 238మంది మూడు నుండి ఆరు నెలల మధ్య జైళ్లలో ఉన్నారు. మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య 416మంది, ఒకటి నుండి మూడు సంవత్స రాల మధ్య దాదాపు 1200 మంది జైళ్లల్లో ఉన్నారు. అదే 2021 నాటికి విచారణ ఎదుర్కొంటున్న 2,800 మందిలో మూడేండ్లకు పైగా జైల్లో ఉన్నవారు 1113మంది. చట్టం కచ్చితంగా పాలకుల చుట్టమేనని పదేపదే నిరూపితం అవుతున్నది.
పాలక పార్టీల నాయకులు, వారు తిన్నది, లేక తిన్నారని అభియోగాలు ఉన్నది వేల, లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. దీనిపై రేపుతున్న దుమారం ముందు జైల్లో మగ్గుతున్న మేధావుల గురించి, అమాయక ప్రజల గురించి వస్తున్న వార్తలు ఏ మాత్రం ప్రజల దృష్టికి రానీయడం లేదు. అందువలన పాలక పార్టీల అవినీతిపై పోరాడుతూనే, చట్టాల మీద, న్యాయస్థానాల మీద భ్రమలు ఏర్పరుచుకోవడం పొరపాటు. అలాగే మతోన్మాద కూడలిలో చిక్కుకున్న రాజ్యం అత్యంత క్రూరంగా మేధావుల మీద, సాంఘిక కార్యకర్తల మీద చేస్తున్న ఏకపక్ష దాడిపై పోరాటం జరపకపోతే సమాజానికే తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ వర్గ దృష్టితో ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత ఉద్యమ కార్యకర్తల పైన ప్రధానంగా ఉంటుంది. ఈ కర్తవ్య నిర్వహణ భుజానికి ఎత్తుకోకపోతే పాలకవర్గాల నాటకీయ చర్చలు ప్రజలను పదేపదే మోసం చేస్తూనే ఉంటాయి.
ఆర్‌. రఘు
9490098422