రోజుకో తీరుగా..కదిలిన అంగన్‌ వాడీలు

– మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ నాయకులు
నవతెలంగాణ-గండిపేట్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే వరకు తమ పోరాటం కోనసాగిస్తామంటూ అంగన్‌ వాడీ ఉద్యోగస్తులు రోజుకో తీరుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గండిపేట్‌ మండలంలో సీఐటీయూ ఇచ్చిన పిలుపులో భాగంగా అంగన్‌ వాడీ ఉద్యోగస్తులు నిరవధిక సమ్మెను కోనసాగిస్తున్నారు. మంగళవారం గండిపేట్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు క్యాతం అశోక్‌యాదవ్‌ అంగన్‌ వాడీ ఉద్యోగస్తులకు సంపూర్ణ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపేట్‌ మండలంలో సమ్మెకు దిగిన అంగన్‌వాడీలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఖానాపూర్‌లో నార్సింగి మున్సిపల్‌ అధ్యక్షులు పెద్దపుల్లి కిషన్‌ (కృష్ణ) కాంగ్రెస్‌ నాయకులతో కలిసి వారి చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలిచ్చారు. నార్సింగిలో వార్డు ఆఫీసుల్లో చేపట్టిన సమ్మెకు కౌన్సిలర్‌ కె. ఉషారాణి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ రూ.26 వేల వేతనం చేల్లించాలని డిమాండ్‌ చేశారు. మంచిరేవుల గ్రామంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్‌, మాజీ ఉపసర్పంచ్‌ కృష్ణ భగువాన్‌రెడ్డి, కౌన్సిలర్‌ పద్మావీరెడ్డి మద్దుతు పలికారు. గండిపేట్‌ మండలం ఎంఐఎం అధ్యక్షులు రిజ్వాన్‌ నేహాల్‌ ఆద్వర్యంలో అంగన్‌ వాడీ ఉద్యోగులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఉషారాణి , మాజీ సర్పంచులు సుగుణమ్మ, గండయ్య, కాంగ్రెస్‌ నాయకులు, అంగన్‌ వాడీ ఉద్యోగులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.