దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఏఎన్నార్ స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. ఏఎన్నార్ లెగసీకి తగిన ట్రిబ్యూట్గా, భారతీయ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు పొందిన చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న ఈ పురస్కార ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ అవార్డు వేడుకకు ఆహ్వానిం చేందుకు చిరంజీవిని నాగార్జున కలిశారు. ఈ ప్రతిష్టాత్మ ఏఎన్నార్ జాతీయ అవార్డును చిరంజీవికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందజేయనున్నారు. ‘మా నాన్న ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది.
ఈ మైలురాయికి గుర్తుగా ఏఎన్నార్ అవార్డ్స్ 2024కి అమితాబ్ బచ్చన్, చిరంజీవిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్ను మరపురానిదిగా చేద్దాం’ అని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని డిలైట్ ఫుల్ ఫోటోలని సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.
నాగార్జున, చిరంజీవిని ఒకే ఫ్రేమ్లో చూడటం అభిమానులకు స్పెషల్ ట్రీట్గా నిలిచింది. నాగార్జున, చిరంజీవి, అమితాబ్ బచ్చన్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ ఈవెంట్ విజువల్ ఫీస్ట్గా ఉండబోతోంది. ఏఎన్నార్ అవార్డుని గతంలో దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతిమాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీదేవి, రేఖ తదితరులు సొంతం చేసుకున్నారు.