రాష్ట్రానికి మరో ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ

– టీసీఎల్‌ గ్రూపు రూ.225 కోట్ల పెట్టుబడి
– తొలి దశలో 500 ఉద్యోగావకాశాలు
– మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీసీఎల్‌-రిసోజెట్‌ సంస్థ ప్రతినిధుల అవగాహన ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ టీసీఎల్‌ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించ నున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్‌ సంస్ధతో కలసి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్‌ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చు కున్నారు. రిసోజెట్‌తో కలిసి టీసీఎల్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ సంస్థ రూపంలో ప్రపంచ స్థాయి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఆ రంగంలో విస్తత ఉత్పత్తుల శ్రేణిని కలిగిన టీసీఎల్‌ ఎలక్ట్రానిక్స్‌ తన ప్రధాన కేంద్రమైన చైనాలోని హెఫెయి నగరం తర్వాత విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్‌ ఇదే కావడం విశేషం. తొలుత వాషింగ్‌ మెషిన్లను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ తయారీ కేంద్రం నుంచి సమీప భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్‌ వాషర్లను కూడా ఉత్పత్తి చేయనున్నారు.
రంగారెడ్డిలోని రావిర్యాల్లో ఉన్న ఈ-సిటీలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్‌ కోసం టీసీఎల్‌ సంస్ధ రూ.225 కోట్ల పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ తయారీ యూనిట్‌ ద్వారా సుమారు 500 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలిదశలోనే రానున్నాయి. రాష్ట్రానికి టీసీఎల్‌ కంపెనీ రాకను మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి ఇక్కడ అవకాశమున్నదని తెలిపారు. టీసీఎల్‌ కంపెనీ పెట్టుబడి ద్వారా రాష్ట్రం ఎలక్ట్రానిక్స్‌ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటుందని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని, టీసీఎల్‌ కంపెనీ రాష్ట్రంలో తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిసోజెట్‌ కంపెనీ ఎండీ రమీందర్‌సింగ్‌ సోయిన్‌, టీసీఎల్‌ ప్రతినిధులకు కేటీఆర్‌ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. టీసీఎల్‌ తయారీ యూనిట్‌కి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని రాష్ట్రం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరాన్ని షెన్జన్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీఎల్‌ సంస్థ చైర్మెన్‌ జువాన్‌ డూకి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ విధానానికి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతుల రంగంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని ఆమెను కేటీఆర్‌ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రిసోజెట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ రమీందర్‌ సింగ్‌ సొయిన్‌, తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజారు కారంపురి తదితరులు పాల్గొన్నారు.