బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

– జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌
– తెలంగాణ మొత్తం తిరగాలని సీపీఐ(ఎం) నేతలకు విజ్ఞప్తి
– ప్రజలలో చైతన్యం రగిలించేందుకు యాత్రలు : తమ్మినేని
నవతెలంగాణ- మహబూబాబాద్‌
దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ భవిష్యత్తులో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీని ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధన శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన జనచైతన్య యాత్ర సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ , సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు పాలడుగు భాస్కర్‌ , సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్‌ నాయక్‌ మాట్లాడారు. బీజేపీ 8 ఏండ్ల కాలంలో కార్పొరేట్‌ విధానాలతో మతతత్వ రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని అన్నారు. సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్ర తెలంగాణ మొత్తం తిరగాలని, ప్రజలను చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని పోరాడిన కేసీఆర్‌ కూతురు కవితపై ఈడీలను ప్రయోగించి అవమానాల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలు మేలుకొని బీజేపీకి వ్యతిరేకంగా తిరగబడాలని పిలుపునిచ్చారు రైల్వేలు, ఎల్‌ఐసిలు, ఓడరేవులు, బ్యాంకులు, బొగ్గు గనులను ప్రయివేటుపరం చేసి భవిష్యత్తులో రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలకు 50 లక్షల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఘనత కేసిఆర్‌దేనని అన్నారు తెలంగాణ విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ గిరిజన యూనివర్సిటీ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని అన్నారు తెలంగాణలో పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మతోన్మాద ఫాసిస్ట్‌ కార్పొరేట్‌ విధానాలతో 2024లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేస్తూ బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే లక్ష్యంగా ప్రజలలో చైతన్యం రగిలించేందుకు జన చైతన్య యాత్రలు చేపట్టినట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.