ఏ కుల సంఘమైనా ఆ కుల పేదలను ఆదుకుంటేనే ఆ సంఘాలకు మనుగడ

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
– సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – సిరిసిల్ల
విమర్శలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిసారిద్దాం …ఎన్నికలైపోయినయ్… ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం…కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివ్రుద్ది సాధ్యం. గ్రామాలు, పట్టణాలు అభివ్రుద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివ్రుద్ధి సాధ్యం. ఈ విషయం కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.  సిరిసిల్లలోని  మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపానికి  రూ.10 లక్షల ఎంపీ  నిధులతో చేపట్టిన అభివ్రుద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ ను సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కుల సంఘం ఆఫీస్ ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతోంది. కానీ కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతోంది. ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ  నిధులిస్తున్నా…. ఏ కుల సంఘమైనా సరే… ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మీలో ఒకడిని, మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజోపయోగ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నా. మున్నూరుకాపు సంఘం పెద్దల ప్రతిపాదన మేరకు కంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
రెండోసారి ఎంపీగా అత్యదిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉంది. రెండోసారి గెలవడంవల్లే మోదీ కేబినెట్ లో చోటు దక్కింది.  జిల్లా అభివ్రుద్ధి కోసం అహర్నిశలు క్రుషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతోపాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ది చేస్తానని ఆయన అన్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివ్రుద్ది చెందుతాయి. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా…. కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం… అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, అడ్డ హక్ కమిటీ కన్వీనర్ అగ్గి రాములు, దుమాల శ్రీకాంత్, కల్లూరి రాజు, నీలి శంకర్, రాణి రుద్రమ రెడ్డి, శీలం రాజు, రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు